100 శాతం ఫీజులు వసూలు చేసుకోవచ్చు - సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు
100 శాతం ఫీజులు వసూలు చేసుకోవచ్చు - సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు
న్యూఢిల్లీ : లాక్డౌన్ కాలానికి సంబంధించి సిబిఎస్ఈ పాఠశాలలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులో 60 శాతం మాత్రమే తీసుకోవాలన్న రాజస్తాన్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 100 శాతం ఫీజు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మార్చి నుంచి ఆగస్టు వరకు ఆరు నెలల బకాయిలను వసూలు చేసుకునేందుకు ధర్మాసనం సిబిఎస్ఈ పాఠశాలలకు అనుమతినిచ్చింది. 2019-20 విద్యాసంవత్సరంలో నోటిఫై చేసిన దానికి అనుగుణంగా ఈ ఫీజులు ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఫీజులు చెల్లించలేని కారణంగా విద్యార్థులను తరగతులకు హాజరుకాకుండా డీబార్ చేయొద్దని, అదేవిధంగా ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులపై సానుభూతితో వ్యవహరించాలని తెలిపింది.
బకాయిలు చెల్లించనందున ఏ విద్యార్థిని కూడా 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరుకాకుండా ఆపవద్దని యాజమాన్యాలను ఆదేశించింది.
No comments