పీఆర్సీపై తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో కొత్త టెన్షన్..!
మూడేళ్ల ఎదురు చూపుల తర్వాత పీఆర్సీ రిపోర్ట్ వచ్చింది. అందులోని సిఫారసులు ఉద్యోగులను నిరాశపరిచాయి. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కూడా మొదలుపెట్టింది. అయితే అన్ని సంఘాలను పిలవకపోవడంతో కొత్త చర్చ.. రచ్చ మొదలైంది. కొన్ని యూనియన్లు డైలమాలో పడ్డాయి. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
సీఎస్ కమిటీ మెలికతో కొన్ని సంఘాలు ఇరకాటంలో పడ్డాయా?
వేతన సవరణపై కమిషన్ రిపోర్ట్ అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేతృత్వంలో ముగ్గురితో కమిటీ వేశారు సీఎం కేసీఆర్. ఒకవైపు పీఆర్సీ సిఫారసులపై ఉద్యోగులు భగ్గుమంటోన్న సమయంలోనే ఈ చర్చల ప్రక్రియ మొదలైంది.
కొన్ని సంఘాలతో భేటీ కూడా జరిగింది. అయితే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నది ఆయా యూనియన్ల అభిమతం. కానీ.. సీఎస్ కమిటీ పెట్టిన మెలికతో కొన్ని సంఘాలు ఇరకాటంలో పడ్డాయి.
కొన్ని సంఘాలతోనే చర్చలపై విమర్శలు!
అదర్ డ్యూటీ సౌకర్యం ఉన్న సంఘాలను మాత్రమే చర్చలకు పిలవాలని సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఒక ప్రాతిపదిక పెట్టుకుంది. గత నెల 27 నుంచి 29 వరకు జరిగిన చర్చలకు ఓడీ సౌకర్యం ఉన్న యూనియన్లనే పిలిచారు. దాదాపు 13 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆ సమావేశానికి వచ్చాయి. పీఆర్సీ సిఫారసులపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. చర్చల విషయంలో కొన్ని యూనియన్లనే పిలవడం ఏంటని మిగతా ఉద్యోగ సంఘాలు విమర్శించాయి. ఇలాంటి వారితో రాష్ట్రంలోని విపక్ష పార్టీలు కూడా శ్రుతి కలిపాయి.
పిలుపు రాకపోతే చులకన అవుతామనే ఆందోళన!
ఈ డిమాండ్ల తర్వాత సీఎస్ కమిటీ మనసు మార్చుకుందో ఏమో .. మరికొన్ని సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించింది. వారితో సమావేశానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇప్పుడు అందరి దృష్టీ సీఎస్ ఆఫీస్పై ఉంది. ఏ ప్రాతిపదికన.. ఎన్ని సంఘాలను చర్చకు పిలుస్తారు? ఎవరిని గుర్తిస్తారు? పిలవడం మొదలుపెడితే అంతే ఉండదనే కామెంట్స్ ఎందుకు వినిపిస్తున్నాయి? ఇలా ఉద్యోగులు ప్రశ్నించుకుంటున్నారట. ఒకవేళ పిలుపు రాకపోతే మిగతా యూనియన్ల ముందు చులకన అవుతామని భావిస్తోన్న సంఘాలు క్రమంగా స్వరాలు పెంచుతున్నాయి.
తమ డిమాండ్తో చర్చల్లో కాలయాపన జరుగుతోందా?
పనిలో పనిగా కొందరైతే సీఎస్ ఆఫీస్తో సంబంధం ఉన్నవారికి ఫోన్ చేసి.. మాకేమైనా పిలుపు వస్తుందా అని ఆరా తీస్తున్నారట. ఇంకొందరైతే ఆర్థికశాఖకు పోన్ చేసి అడుగుతున్నారట. ఒకవేళ ఎవరికైనా పిలుపులు వెళ్లినట్టయితే.. ఎవరిని పిలిచారు అని ప్రశ్నిస్తున్నరట. అయితే సమస్య తీవ్రతను గుర్తించినా ఆయ శాఖల ఉన్నతాధికారులు ఈ అంశంపై పెదవి విప్పడం లేదని సమాచారం. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా సీఎస్ కమిటీ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో ఆహ్వానాల కోసం ఎదురు చూస్తోన్న సంఘాలు డైలమాలో పడ్డాయట. అందరినీ చర్చలకు పిలవాలని డిమాండ్ చేసి తప్పు చేశామా అని చెవులు కొరుక్కుంటున్నాయట. పైగా తమ డిమాండ్ను అడ్డంపెట్టుకుని సీఎస్ కమిటీ చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని మరికొందరు అనుమానిస్తున్నారట. మరి.. పీఆర్సీ నివేదికపై చర్చలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో.. చర్చల్లో ఎంత మంది పాల్గొంటారో చూడాలి.
No comments