Andhra Pradesh: ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్... 2లక్షల మందికి క్యాష్ ప్రైజ్
ఆంధ్రప్రదేశ్ లోని వార్డు, గ్రామ వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారిని సత్కరించాలని సీఎం నిర్ణయించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను మూడు విభాగాలుగా విభజించి అవార్డులు ఇవ్వనున్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో అవార్డులిచ్చి గౌరవించనున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు ప్రసంశా పత్రం, మెడల్ తో పాటు బ్యాడ్జి, శాలువాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ఎంపిక చేసిన వాటిని సీఎం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేటగిరీల్లో మొత్తం 2లక్షల 22వేల 900 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఈ ఏడాది ఉగాది నుంచి జిల్లాల్లో ప్రతిరోజూ ఒక నియోజకవర్గంలో వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు.
జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ప్రతి రోజూ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఈవెంట్లలో మంత్రులు,ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉగాది రోజున సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలకు జగన్ హాజరయ్యే అవకాశముంది. మొత్తం 2,22,900 మంది వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 2,18,115 మందికి సేవా మిత్ర అవార్డుతో పాటు రూ.10వేల నగదు ప్రోత్సాహం అందిచనున్నారు. విధి నిర్వహణలో ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా పనిచేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు.
4 వేల మంది వాలంటీర్లకు రెండో కేటగిరీ అయిన సేవారత్న అవార్డుతో సత్కరిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇంటింటి సర్వే, రేషన్ డోర్ డెలివరీ, రైస్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరులో సమర్ధవంతంగా పనిచేసిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. వీరి ఎంపికను ప్రభుత్వం ప్రాంతాల వారిగా చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మండలానికి ఐదుగురు, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున సేవా రత్న అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన వారికి మెడల్, శాలువ, బ్యాడ్జి, ప్రసంశాపత్రంతో పాటు రూ.20వేల నగదు బహుమతి అందిస్తారు. ఇక మూడో కేటగిరీకి సంబంధించి సేవా వజ్ర అవార్డుకు 875 మందిని ఎంపిక చేశారు. వీరికి శాలువా, సర్టిఫికెట్, బ్యాడ్జి, మెడల్ తో పాటు రూ.30వేల నగదు బహుమతి ఇస్తారు.
No comments