Latest

Loading...

ఉస్మానియాలో అరుదైన శస్త్ర చికిత్స.. ఇండియాలోనే ఫస్ట్ టైం


హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న 

వృద్ధురాలికి ఉస్మానియా వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇలాంటి కేసులు ప్రపంచంలో ఇప్పటివరకు మూడే వెలుగు చూడగా, మొదటిసారి దేశంలో ఈ కేసును గుర్తించడంతోపాటు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశా రు.

 గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌

, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాదిపతి డాక్టర్‌ మధుసూధన్‌, ఎండోక్రనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాఖేష్‌ సహాయ్‌, అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ పాండూనాయక్‌ వివరాలు వెల్లడించారు. బహదూర్‌పురా కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఖైరురన్నీసా బేగం(62)కు 

ఆరునెలలుగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పడిపోవడం

 కారణంగా తరచూ కళ్లు తిరగడం, ఫిట్స్‌ రావడం, మాట్లాడలేకపోయేది.దీంతో రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో చేర్చించారు.

అక్కడి వైద్యులు కాలేయభాగంలో పెద్ద కణతి(ట్యూమర్‌) 

ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు. శస్త్రచికిత్సకు సిద్ధం చేసిన ప్రతీసారి ఆమె రక్తంలో షుగర్‌ లెవల్స్‌ 30 నుంచి 40కు పడిపోయేవి. దీంతో ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. గత నెల 3న ఉస్మానియా సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అడ్మిట్‌ చేసుకున్న వైద్యులు పలు పరీక్షలు చేసిన తర్వాత ఆమె శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 

వైద్య పరిభాషలో అది 'డొజే పొట్టెరీ సిండ్రోమ్‌'

 అని తేల్చారు. కాలేయం వద్ద పెరిగిన కణతి నుంచి ఇన్సులిన్‌ ఉత్సత్తి అధికంగా ఉండడంతో రిపోర్టులను అమెరికాలోని ఓ ల్యాబ్‌కు పంపించారు. షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నప్పుడు కణతి తొలగిస్తే ఆమె ఆరోగ్యం మరింత క్షిణించే అవకాశం ఉండడంతో అనస్తీషియా విభాగం వైద్యుల అభిప్రాయంతో ఈ నెల 12న సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోక్రనాలజీ, అనస్తీషియా విభాగాల వైద్యబృందాలు ప్రతి క్షణం రోగిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఫ్లూయిడ్స్‌ ద్వారా షుగర్‌ లెవల్స్‌ తగ్గకుండా చేసి 10 గంటల పాటు శ్రమించి, ఎనిమిది కిలోల కణతితోపాటు పాడైన కొద్ది పాటి కాలేయ భాగాన్ని సైతం తొలగించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో దాదాపు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఖర్చు అయ్యే శస్త్ర చికిత్సను ఉస్మానియా వైద్యులు ఉచితంగా చేయడంతో పాటు ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించారు. గురువారం ఆమెను డిశ్చార్జ్‌ చేశారు.

దేశంలో మొదటిది..

కాలేయ భాగంలో కణతితోపాటు అది ఇన్సులిన్‌ను మోతాదుకు మించి ఉత్సత్తి చేయడం వంటి కేసులు ప్రపంచంలో ఐదు మాత్రమే నమోదైనట్లు సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ మధుసూధన్‌ తెలిపారు. ఈ ఐదు కేసుల్లో మూడింటిలో మాత్రమే విజయవంతంగా కణతులను తొలగించారని చెప్పారు. మన దేశంలో ఇలాంటి కేసు రావడం మొదటి సారి అని, ప్రపంచంలో ఇది 4వ కేసుగా గుర్తించినట్లు చెప్పారు. త్వరలో ఇండెక్స్‌ మెడికల్‌ జనరల్‌లో ఈ కేసును పబ్లిష్‌ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌, జనరల్‌ సర్జరీ వైద్యులు డాక్టర్‌ పల్లం ప్రవీణ్‌, డాక్టర్‌ రమేష్‌ కుమార్‌, డాక్టర్‌ పావని, డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ సుదర్శన్‌, డాక్టర్‌ వరుణ్‌, డాక్టర్‌ హేమంత్‌, డాక్టర్‌ వేణుమాదవ్‌, డాక్టర్‌ పతాంజలిలు శస్త్ర చికిత్స చేసిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో ఆర్‌ఎంఓ - 1 డాక్టర్‌ శేషాద్రి, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ శుష్మాతో పాటు వైద్య సిబ్బంది ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు.

 

No comments

Powered by Blogger.