ఉప్పు ఎక్కువగా తింటున్నారా? అయితే..
ఆంధ్రజ్యోతి(19-03-2021)
ప్రశ్న: ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?
- గిరీష్, ఆదిలాబాద్
డాక్టర్ సమాధానం: ఆహారానికి చక్కని రుచి తేవడంలో ఉప్పు కీలకమైంది. హానికారక బాక్టీరియా పెరుగుదలను నిరోధించే గుణం ఉప్పుకు ఉండడం వల్ల పచ్చళ్ళు, ఊరగాయలు నిల్వ ఉండేలా చేస్తుంది. నలభైశాతం సోడియం, అరవైశాతం క్లోరైడ్తో ఉప్పు తయారవుతుంది. కండరాలు, నరాల పనితీరు సక్రమంగా పని చేసేందుకు, కణాల్లో, కణాల బయట, రక్తంలో ఉండే నీటి పరిమాణాన్ని నియంత్రించేందుకు ఉప్పులోని సోడియం ఉపయోగపడుతుంది. రోజుకు ఆరుగ్రాములకు మించి ఉప్పు తీసుకోవడం మంచిదికాదు. అతిగా ఉప్పు తినడం వల్ల శరీరంలో నీటిశాతం పెరగడం, ముఖ్యంగా కాళ్ళుచేతుల్లో నీరుపట్టి వాపు రావడం, పదే పదే దాహం వేయడం, రక్తపోటు పెరగడం లాంటి తాత్కాలిక ప్రభావాలు ఉంటాయి.దీర్ఘకాలికంగా చూస్తే ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. గుండె జబ్బులూ రావచ్చు. అధిక రక్తపోటు ఏర్పడవచ్చు. అయితే పూర్తిగా ఉప్పు మానేసినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
No comments