Latest

Loading...

Yadadri Temple: యాదాద్రి అలా ఉండాలి.. పనులు వేగంగా పూర్తి కావాలన్న సీఎం కేసీఆర్


యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి దివ్యక్షేత్రాన్ని త్వరలో పునర్ ప్రారంభించాలని కొద్దిరోజుల క్రితమే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. పెండింగ్ పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. యాదాద్రి ఆలయ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం కోసం కార్యాచరణ గురించి ఆలయ అధికారులతో చర్చించారు. కొద్దిరోజుల క్రితమే యాదాద్రిలో పర్యటించి క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని పరిసర ప్రాంతాలను కలియదిరిగిన సీఎం కేసీఆర్.. అధికారులకు పలు సూచనలు చేశారు.దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ అధికారులతో చర్చించారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని అన్నారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం కేసీఆర్ ముందుంచారు. వీటిని పరిశీలించిన మీదట నాలుగింటిలో ఒకదాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.

ఉత్తర దిక్కున వున్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 కల్లా క్యూలైను నిర్మాణం పూర్తికావాలని సిఎం గడువు విధించారు. దీప స్థంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్ కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని అన్నారు. శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న సీఎం, ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలని అధికారులకు సూచించారు.

ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా (ఐకానిక్ ఎలిమెంట్ లాగా) కనిపించే విధంగా తుదిమెరుగులు దిద్దాలని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం ఏర్పాటు చేసినట్టు గానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమీయాలని అన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్‌తో తీర్చిదిద్దాలన్నారు.

విష్ణు పుష్కరిణీ కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. 80 ఫీట్ల పొడవు వున్న దీప స్థంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలని తెలిపారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమౌతున్నదని సిఎం కేసీఆర్ కితాబిచ్చారు.

పునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోందని సీఎం కేసీఆర్ అన్నరు. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమౌతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నదని తెలిపారు. పున: ప్రారంభానంతరం లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని... వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వుండే విధంగా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలని అన్నారు.

 

No comments

Powered by Blogger.