కారోనకు భయపడి కషాయాలు ఎక్కువగాతాగుతున్నారా...అయితే జాగ్రత్త...
రోగ నిరోధక శక్తి ఉంటేనే కరోనాను ఎదుర్కోవచ్చు
అవగాహనతోనే ఆయుర్వేద మందులు వాడాలి
ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాశ్రీనివాస్
ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కరోనా వణికిస్తోంది. ఏం చేస్తే వైరస్ బారిన పడకుండా ఉంటాం? ఓ వేళ సోకితే ఎలాంటి చిట్కాలు పాటించి దూరం చేసుకోవాలి? అల్లోపతి సరే ఆయుర్వేదంలో మందులున్నాయా? ఇలా అనేక మందిలో ఉన్న సందేహాలకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ సమాధానాలు ఇచ్చారు. మహమ్మారిని ఎదుర్కోవాలంటే మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి తగినంతగా ఉండాలని. దాన్నీ పెంచుకునేందుకు పలు రకాల ఔషధాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇంటి చిట్కాలు కూడా ఎంతో మేలు చేస్తాయని, కషాయాలు అధికంగా సేవించడంతో ఇతర సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. ఎవరికి తోచింది.. వారు చేయకుండా సరైన అవగాహనతోనే ఆయుర్వేద చిట్కాలు పాటించాలి.
కరోనా నివారణకు ఆయుర్వేదంలో పరిష్కారాలున్నాయా?
కరోనాను ఎదుర్కొవాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి.
అయితే దీన్ని పెంచుకునేందుకు ఆయుర్వేదంలో పలు రకాల ఔషధాలు ఉన్నాయి.
నేలవేము, తిప్పతీగ.. కషాయం లేదా పొడిని తేనె, పాలలో తీసుకోవడం ద్వారా కరోనా నుంచి బయట పడవచ్చు.
పాజిటివ్ అని తెలియగానే తులసి, దాల్చిన చెక్క, శొంఠి మిరియాలు కలిపి తగు మోతాదులో తీసుకోవాలి.
చూర్ణాన్ని కషాయం లేదా మాత్రల రూపంలో తీసుకుంటే మంచిది.
అత్యవసర పరిస్థితుల్లో ఆధునిక వైద్య సేవలు పొందాలి.
రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలి?
వ్యాధులు రాకుండా ఎదుర్కొనే శక్తిని ఇమ్యూనిటీ పవర్గా పిలుస్తారు.
అశ్వగంధ, గుడూచి(తిప్పతీగ), యాలకి, హరిద్వ(పసుపు) వంటి మూలికలు వాడి రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
ఉసిరి, హరిద్రను కలిపి తీసుకుంటే బ్యాక్టీరియా, వైరస్లను ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది.
అశ్వగంధతో అనేక ఉపయోగాలున్నాయి.
కరోనా సోకినప్పుడు మానసిక ఆందోళనకు లోనైన వారు అశ్వగంధను తీసుకోవడం ఉత్తమం.
అమృత అని పిలిచే గుడూచి ఉత్తమ వ్యాధి నిరోధక శక్తిని పెంచే మూలిక.
దీని ఆకులు, కాండం, వేర్లను కలిపి దంచి కషాయం చేసి వేడి చేసి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఇది అన్ని రకాల జ్వరాలతో పాటు కరోనాను తగ్గిస్తుంది.
వంటింటి చిట్కాలతో ఉపయోగం ఎంత?
శ్వాస కోశ వ్యాధులు, జలుబు లాంటి వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయుర్వేదంలో అనేక చిట్కాలున్నాయి.
చిన్న చిన్న అనారోగ్య సమస్యలను వంటింటి చిట్కాలు పోగొడుతాయి.
అయితే ఇందుకు వాడే పదార్థాలను సమ పాళ్లలో తీసుకోవాలి.
అతిగా వాడితే అనారోగ్యమే. ఆయుర్వేద వైద్యుల సూచనలు, సలహాల మేరకే ఈ చిట్కాలను పాటించడం ఎంతో మేలు.
శొంఠి, మిరియాలతో కరోనాను తగ్గించుకోవచ్చా?
కరోనాను ఎదుర్కొనేందుకు తులసి, శొంఠి, దాల్చినచెక్క, మిరియాలు ఉపయోగపడుతాయి.
సమపాళ్లలో కలిపి వీటని పొడిగా చేసి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
లేదా మందుల దుకాణాల్లో లభించే మాత్రలను రోజుకు రెండు వేసుకోవడం ఉత్తమం.
ఈ విధానాన్ని ఐసీఎంఆర్, అయుష్ మినిస్ట్రీ కూడా ప్రకటించింది. తులసీ ఆకు, మిరియాలు ఊపిరితిత్తులకు ఎంతగానో పని చేస్తాయి.
తిప్పతీగ, నేలవేము, కటిక రోహిణి తీసుకోవచ్చు.. చిటికెడు పసుపు, అరచెంచా మిరియాలు పాలల్లో కలిపి తీసుకుంటే గొంతులో ఏర్పడిన శ్లేష్మం తొలగిపోతుంది.
కషాయాలతో ఉపయోగం ఎంత?
కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి అనేక మంది అనేక కషాయాలు చేసుకొని తాగుతున్నారు.
లవంగాలు, దాల్చిన, మిరియాలతో తయారు చేసిన ద్రావణాలను తాగడం అలవాటు చేసుకున్నారు.
అయితే ఈ కషాయాలను ఎక్కువ సార్లు, ఎక్కువ మోతాదులో తాగడం ప్రమాదకరమే.
హైపర్ ఎసిడిటీ, పేగుల్లో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది.
ఎసిడిటీ ఉన్న వారు కషాయాలు కాకుండా వాము, మిరియాలు కలిపిన మజ్జిగ తాగితే మంచిది.
అల్లోపతితో పాటు ఆయుర్వేద మందులు వాడొచ్చా?
తప్పేమీ లేదు. కరోనా తీవ్రతను బట్టి అల్లోపతితో పాటు ఆయుర్వేదం వాడొచ్చు.
వైరస్ ప్రభావం తక్కువ ఉన్నప్పుడు ఆయుర్వేద మందులు మంచి ఫలితాలు ఇస్తాయి.
ఆయుర్వేద మూలికలతో విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
శ్వాస సంబంధ సమస్యలకు ఏం చేయాలి?
కరోనా ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేస్తుంది. పసుపును తీసుకుంటే కురుకుయన్ అనే రసాయనం తిరిగి ఊపిరితిత్తుల కణజాలాన్ని మృదువుగా మారుస్తుంది. అడ్డసారం(వాసా) శ్వాస ఇబ్బందులను తగ్గిస్తుంది. దగ్గును పోగొడుతుంది. కరోనాకు ఇది మంచి ఔషధం. అంతేకాక తులసి, మిరియాలు గొంతు గరగరను తగ్గిస్తాయి.
No comments