Corona ఒకే ఒక్క డోసు.. 24 గంటలులో ..40 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. !
40 మంది కోవిడ్ బాధితులు ఒకేఒక్క డోసుతో 24 గంటల్లో కోలుకున్నారు. ఆ డోసు పేరు 'మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్'. కరోనా చికిత్సకు భారత్లో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన 'మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్' అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని 'ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఎఐజి)'లో ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... 40 మంది కోవిడ్ బాధితులకు ఇటీవల 'మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్' ఇచ్చినట్లు తెలిపారు. వారంతా జ్వరం సహా ఇతర అనారోగ్య లక్షణాల నుంచి 24 గంటల్లో కోలుకున్నారని చెప్పారు.
కొద్ది రోజుల్లోనే వైరస్ సైతం పూర్తిగా కనుమరుగైనట్లు వెల్లడించారు.
కోవిడ్ వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీల ఔషధం..
కోవిడ్ వైరస్ను ఎదుర్కొనే కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే యాంటీబాడీలను కలిపి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్ యాంటీ బాడీస్ అంటారు. సార్స్ కోవ్-2లోని స్పైక్ ప్రోటీన్పై పనిచేయడం వీటి ప్రత్యేకత. ఈ ప్రొటీన్ను అడ్డుకొంటే వైరస్ శరీరంలోని ఎసిఈ2 కణాలకు అతుక్కోదు. ఈ రెండు యాంటీబాడీలు కలిసి స్పైక్ ప్రొటీన్లో ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేసి మానవ కణాల్లో ప్రవేశించకుండా చూస్తాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్ల పనిపడతాయి. తక్కువ నుంచి ఓ మోస్తరు లక్షణాలుండి ఎక్కువ రిస్క్ ఉన్న బాధితుల్లో దీనిని వినియోగిస్తారు.
ఈ కాక్టెయిల్తోనే ట్రంప్ త్వరగా కోలుకున్నారు..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడ్డ సమయంలో ఆయనకు ఈ కాక్టెయిల్ను అందించారు. ఇది తీసుకున్న తర్వాత ఆయన వేగంగా కోలుకోవడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది.
దీని ధర డోసుకు రూ.59,750..
ఔషధ తయారీ సంస్థ రోచ్ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని ఇటీవలే భారత మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దీని ధర డోసుకు రూ. 59,750గా నిర్ణయించాయి. తొలి బ్యాచ్లో భాగంగా లక్ష ప్యాక్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. జూన్ మధ్యలో రెండో బ్యాచ్ ప్యాక్లు అందుబాటులోకి తెస్తామని రోచ్ ఇండియా, సిప్లా గతంలో ఓ ప్రకటనలో తెలిపాయి.
100 శాతం వైరస్ కనుమరుగైనట్లు పరీక్షల్లో తేలింది : డాక్టర్ నాగేశ్వర్రెడ్డి
అమెరికాలో జరిపిన అధ్యయనం ప్రకారం.. ఈ కాక్టెయిల్ డ్రగ్ బ్రిటన్, బ్రెజిల్, సౌతాఫ్రికా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. భారత్లో తొలిసారి వెలుగుచూసిన డెల్టా వేరియంట్పై ఇది ఏ మేర పనిచేస్తుందన్న దానిపై ఇంకా ఎవరూ అధ్యయనం జరపలేదు. డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. '' ఎఐజి లో కోవిడ్ బాధితులకు ఈ కాక్టెయిల్తో చికిత్స అందిస్తూనే సమాంతరంగా డెల్టా వేరియంట్పై పనిచేస్తుందో ? లేదో ? అనే అధ్యయనం కూడా చేస్తున్నాం. ఈ కాక్టెయిల్ తీసుకున్న 40 మంది కోవిడ్ బాధితుల ఆరోగ్య పరిస్థితి వారం తర్వాత సమగ్రంగా విశ్లేషించాం. వీరిలో 100 శాతం వైరస్ కనుమరుగైనట్లు ఆర్టిపిసి ఆర్ పరీక్షల్లో తేలింది '' వివరించారు.
అతిగా వాడడం వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం..
ఈ కాక్టెయిల్ చికిత్సను విచ్చలవిడిగా బాధితులకు అందించడం కూడా సరికాదని నాగేశ్వర్రెడ్డి అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు మాత్రమే బాధితులకు అందజేయాలన్నారు. అతిగా వాడడం వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
No comments