Latest

Loading...

APNews : ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం.. సీఎం జగన్ కీలక నిర్ణయం


 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 16వ తేదీ నుంచి పాఠశాలలను పున: ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అదే రోజున మొదటి విడత ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితమిచ్చి.. రెండో విడత పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అటు స్కూల్స్ రీ-ఓపెన్ రోజున నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరిస్తామని సీఎం జగన్ తెలిపారు. విద్యార్ధులకు విద్యాకానుక కిట్‌లను సైతం అదే రోజున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ”ఆగష్టు 16 నుంచి స్కూల్స్ ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు.


అలాగే విద్యాకానుక కిట్ల పంపిణీపై సమీక్ష నిర్వహించి అదనంగా డిక్షనరీలు కూడా జతచేయాలని సూచించారు. ఇక ‘నాడు-నేడు’ మొదటి విడత పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ఆగష్టు 16న జాతికి అంకితం ఇచ్చి.. రెండో విడత పనులను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. నూతన విద్యావిధానంపై అపోహలు తొలగించాలని.. దానిపై సమగ్ర వివరణ స్కూల్స్ రీ-ఓపెన్ రోజున ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతీ మండలంలో ఒక జూనియర్ కాలేజ్ ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా.. సుమారు 16 వేల కోట్లతో రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలు ఆధునీకరించాలని ముఖ్యమంత్రి అన్నారని” మంత్రి పేర్కొన్నారు.


కాగా, స్కూల్స్‌లో అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా చూస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈలోపు టీచర్లందరికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. దానికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ ఏడాది ఇంటర్, డిగ్రీ కాలేజీల అడ్మిషన్లు ఆన్లైన్‌లోనే నిర్వహిస్తామన్నారు. ఎవరైనా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.


థర్డ్ వేవ్‌పై ఏపీ ప్రభుత్వం అలెర్ట్…


సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో ఏపీలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలు చేయాలని చూస్తున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 26 ఆసుపత్రుల్లో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో నాన్‌ ఐసీయు పడకలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లానింగ్‌ పేరుతో 696 కోట్లు రూపాయలు కేటాయించాయి. ఈ నిధులతో అన్ని జిల్లాల్లోని ఆసుపత్రులు, బోధనా ఆసుపత్రుల్లో 12 పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కొవిడ్‌ రూల్స్‌ పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

No comments

Powered by Blogger.