నకిలీ టీకాలపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక.. ఎలా గుర్తించాలో వివరణ...!!
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. నకిలీ టీకాలను ఎలా గుర్తించాలో అన్నది వివరించింది.
భారత్లో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ నకిలీ వెర్షన్ల గురించి అంతర్జాతీయ మార్కెట్లో ప్రచారం జరుగుతున్నది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లను సీజ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు అప్రమత్తం చేసింది. భారత్లో కూడా నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అమ్ముతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దర్యాప్తును ప్రారంభించింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వినియోగిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ల ప్రామాణికతను గుర్తించేందుకు అనుసరించాల్సిన విధానాల జాబితాను రాష్ట్రాలకు కేంద్రం శనివారం జారీ చేసింది. వ్యాక్సిన్ నకిలీదా లేదా అసలైనదా అని గుర్తించడానికి ఈ పారామితులు సహాయపడతాయని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం భారత మార్కెట్లో వాడుతున్న మూడు టీకాలు- కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వీ తయారీ కంపెనీల సమాచారంతో వ్యాక్సిన్ నకిలీదా లేదా అసలైనదా అని గుర్తించేందుకు సహాయపడే పారామితులను తయారు చేసినట్లు తెలిపింది. టీకా తయారీదారులు ఉపయోగించే లేబుల్, రంగు, ఇతర వివరాలను కూడా రాష్ట్రాలకు పంపిన నోట్లో వెల్లడించింది.
కాగా, దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 68 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా పొందినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
No comments