Latest

Loading...

AP-Telangana: అల్పపీడనం ఎఫెక్ట్‌. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.....!!

AP-Telangana

 అల్పపీడనం ఎఫెక్ట్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై పడింది. పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. హైదరాబాద్‌, పరిగి, అరకు, విజయవాడలో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది.


హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండకాసినా…సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. మబ్బులు పట్టి జోరుగా వాన పడింది. రాజేంద్రనగర్‌లో గంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారిపై ఎటు చూసినా నీరే కనిపించింది. రాజేంద్రనగర్‌ వెళ్లే దారిలో పిల్లర్‌ నంబర్‌ 192 పీవీ ఎక్స్‌ప్రెస్‌ కింద మొకాల్లోతు నీరు నిలిచిపోయింది. వాహనదారులు ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన ప్రతిసారీ ఇక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షంనీరు డ్రైనేజీలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటు శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌ ఏరియాలోనూ కుండపోతగా వాన కురిసింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి పలుకాలనీలు జలమయం అయ్యాయి. జాతీయరహదారిపై వర్షపునీరు నిలిచింది. శాంతినగర్‌కాలనీలో మురుగునీరు వీధుల్లోకి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వివేకానంద, బాహర్‌పేట్‌ చౌరస్తాలో రహదారులు చెరువులను తలపించాయి.


అటు ఏపీలోనూ వర్షం దంచి కొట్టింది. విశాఖ జిల్లా అరకులో కుండపోత వర్షం కురిసింది. ఘాట్‌రోడ్డు నదిని తలపించింది. పై నుంచి ఉధృతంగా వరదనీరు వస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి బాడవపేట గంగానమ్మ వీధిలో రేకుల ఇళ్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది.

No comments

Powered by Blogger.