PRC వీడని పీఆర్సీ పీటముడి.. వచ్చేవారం మరోసారి భేటీ...!!
ఏపీలో పీఆర్సీపై నెలకొన్న సందిగ్ధత వీడలేదు. అమరావతిలోని సచివాలయంలో ముగిసింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వచ్చే వారం ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ జరిగే అవకాశం వుంది.
ఆ తర్వాతే ఫిట్ మెంట్, ఇతర ఆర్థిక అంశాల పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా వుంటే
ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు.
మా 71 డిమాండ్ల పై అధికారులు చర్చించారు. ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల 1600 కోట్ల బిల్లులు విడుదల పై సానుకూలంగా స్పందించారు. మార్చి నెల లోపు బకాయిల చెల్లింపులు పూర్తి చేస్తాం అన్నారు. ఫిట్ మెంట్ పై అధికారులు ఇచ్చిన 14 శాతం ను మేము అంగీకరించటం లేదని మరోసారి చెప్పాం. అసలు ఈ నివేదికనే గుర్తించామని చెప్పాం. మేము ఉద్యోగుల పక్షాన ఉన్నాం అని సీఎస్ హామీ ఇచ్చారన్నారు బండి శ్రీనివాసరావు.
ప్రత్యేకంగా 40 అంశాల పై స్పష్టంగా మా అభిప్రాయం చెప్పాం. సమావేశాల పేరుతో కాలాయాపన తప్ప మరో ప్రయోజనం లేదు. సజ్జల వ్యాఖ్యలతో ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు.స్పష్టత ఇవ్వకపోతే సమావేశంలో కొనసాగాల్సిన అవసరం లేదని సీఎస్ తో చెప్పాం. 14.28 శాతం తో ఫిట్ మెంట్ ఇస్తే ప్రతి ఉద్యోగి 4 నుంచి 10 వేల వరకు జీతం తగ్గుతుందని క్యాటగిరీల వారీగా సీఎస్ ముందు పెట్టాం. 28 శాతం ఫిట్ మెంట్ ఇస్తే 3 వేల ఒక వంద కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందని చెప్పాం.
45 శాతం ఫిట్ మెంట్ ఇస్తే ప్రభుత్వం పై పడేది కేవలం 8 వేల కోట్లు మాత్రమే భారం వుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఒకేసారి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలని చెప్పాం. పెండింగ్ డీఏల విషయంలో స్ట్రగుల్ కమిటీ, ఉద్యోగుల నుంచి మా పై తీవ్ర ఒత్తిడి ఉంది. రేపు మూడు గంటలకు మరోసారి మా కార్యవర్గంతో సమావేశం అవుతున్నాం. ఆర్ధికేతర అంశాల పై సగానికి పైగా పరిష్కారం అయినట్లే. పీఆర్సీ ఫిట్ మెంట్, మానిటరీ బెనిఫిట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాతో సమానంగా ఒకే రోజు పీఆర్సీ ఇవ్వాలి అనే అంశాలను సీఎంతో సమావేశంలో డిమాండ్ చేస్తాం అన్నారు బొప్పరాజు
No comments